రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పిన సోము వీర్రాజు

  • ప్రాణాలు తీసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట్ అని వ్యాఖ్యానించిన వీర్రాజు
  • వీర్రాజుపై విమర్శలు గుప్పించిన వైసీపీ నేతలు
  • 'రాయలసీమ రతనాల సీమ' అనే పదం తన హృదయంలో పదిలంగా ఉంటుందన్న వీర్రాజు
ప్రతి జిల్లాలో ఎయిర్ పోర్టులను నిర్మిస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాయలసీమలో ఎయిర్ పోర్ట్, కడపలో ఎయిర్ పోర్ట్, ప్రాణాలు తీసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట్, వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు అంటూ వీర్రాజు అన్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడ్డారు. రాయలసీమ సంస్కృతిని అగౌరవపరిచేలా వీర్రాజు మాట్లాడారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై సోము వీర్రాజు వివరణ ఇచ్చారు. ప్రభుత్వ పని తీరును విమర్శించే క్రమంలో తాను వాడిన పదాలు ప్రజల మనసులను గాయపరిచాయని... అందుకే ఆ పదాలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెపుతున్నానని అన్నారు. 'రాయలసీమ రతనాల సీమ' అనే పదం తన హృదయంలో పదిలంగా ఉంటుందని చెప్పారు. రాయలసీమ అభివృద్ధి కోసం తాను అనేక వేదికలపై ప్రస్తావించానని, ఆ విషయం సీమ ప్రజలకు తెలుసని అన్నారు. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులపై తాను అనేక సార్లు మాట్లాడానని చెప్పారు. రాయలసీమ అభివృద్ధి వేగవంతం కావాలని ఆకాంక్షించారు.

Somu Veerraju
BJP
Rayalaseema
YSRCP

More Telugu News